- ఉమ్మడి కర్నూలు జిల్లాలో తడిసి ముద్దయిన ధాన్యం
- పిడుగుపాటుకు ఇద్దరు మృతి
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి, రాయదుర్గం (అనంతపురం జిల్లా) : కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వడగళ్ల వాన వల్ల వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగి గ్రామంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతొ వర్షం ఒక్కసారిగా విరుచుకుపడడంతో రైతులు అప్రమత్తమయ్యేలోపే నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కౌతాళం, ఆలూరు, ఎమ్మిగనూరు మండలాల్లో కళ్లాల్లో అరబెట్టిన ధాన్యం రాశులు తడిచి ముద్దయింది. కొన్నిచోట్ల ధాన్యం రాశులు వర్షానికి కొట్టుకుపోయాయి. కోసి పొలాల్లో ఆరబెట్టిన వరి కంకులు తడిసిపోయాయి. ధాన్యం నేలపాలై కొట్టుకుపోయింది వరి పంట చేలు నేలకొరగడంతో కంకులు తడిచిపోయాయి. నంద్యాల జిల్లా జీర్లింగాపురంలో వర్షానికి ఇదే విధమైన నష్టం వాటిల్లింది. అవుకు మండలంలో భారీగా గాలులు వీయడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రామాపురంలో చెట్లు కూలాయి, కోవెలకుంట్ల మండలంలో కోత కోసి కళ్లంలో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. కోసి పొలంలో ఆరబెట్టిన మిరప తడిసి దెబ్బతింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపోయిన రైతులు కోరు తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉరు ములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయ్యాయి. దుగ్గిలమ్మ గుడి వీధి, మధు టాకీస్ ప్రాంతంలో రోడ్లు, వీధులు జలమ య్యాయి. గుమ్మగట్ట మండలం రంగచేడు గ్రామంలో పిడుగు పడి ఓ కొబ్బరి చెట్టు కాలిపోయింది.
కౌతాళంలో విషాదం
కర్నూలు జిల్లా కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో పిడుగు పాటుకు ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం… కాత్రికి గ్రామ శివారులో బాలయ్య (22), అశోక్ (21), గంగాధర్, నిరుపాది అనే యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం మారి గాలివాన రావడంతో వారంతా సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. ఆ చెట్టుపై పిడుగు పడటంతో బాలయ్య, అశోక్ మృతి చెందారు. మిగిలిన ఇద్దరూ గాయపడ్డారు.