ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గత ప్రభుత్వంలో అభివృద్ధిని విస్మరించి కేవలం బటన్ నొక్కి ప్రజలకు డబ్బు పంపిణీపైనే దృష్టి పెట్టారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని, సమర్ధవంతమైన నాయకత్వం ఉండాలని అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆదివారం జరిగిన అంజుమన్ – ఏ – ఇస్లామియా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందన్నారు. గుంటూరులో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. పిఎంజిఎస్వై ద్వారా నిధులు సేకరించడం, పొన్నూరులో రైళ్ల నిలుపుదల తదితర సమస్యలను పరిశీలిస్తామన్నారు.
