మాజీ సైనికులు, రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామ పంచాయతీల పరిధిలో నివాసం ఉంటున్న మాజీ సైనికులు, రక్షణ శాఖ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఆస్తి పన్నులో రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై సైనిక సంక్షేమ అధికారి అభ్యర్థనను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ 2003 నవంబరు 20న జారీ చేసిన ఉత్తర్వులకు సవరణ చేశారు. ఆయా పంచాయతీల పరిధిలో మాజీ సైనికులు, రక్షణశాఖ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఒకటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నప్పటికీ ఒక ఆస్తికి మాత్రమే పన్ను మినహాయింపు కల్పిస్తారు. ఆస్తికి సంబంధించి అంతస్తులపై ఎటువంటి అభ్యంతరాలు లేనప్పటికీ ఆస్తి మొత్తం వారి ఆధీనంలో ఉండాలన్నారు. ఇతరులకు అద్దెకు ఇస్తే పన్ను మినహాయింపు వర్తించదని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆయా పంచాయతీలో ఉన్న అసెస్మెంట్లలో ఇటువంటివి 10 శాతం కంటే ఎక్కువ ఉంటే మినహాయింపును 50 శాతానికి పరిమితం చేసే అధికారాన్ని పంచాయతీ పాలకవర్గాలకు కల్పించారు. ఇతర పంచాయతీల్లో 100 శాతం పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

➡️