మరింత భద్రత కల్పించండి : దస్తగిరి

Mar 12,2025 21:13 #dastagiri, #more security, #Provide

ప్రజాశక్తి – కడప ప్రతినిధి : వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల వరుస మరణాల నేపథ్యంలో తనకు మరింత భద్రత కల్పించాలని అఫ్రూవర్‌, కీలక సాక్షి దస్తగిరి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం వైఎస్‌ఆర్‌ జిల్లా ఎస్‌పిని కలవడానికి ఆయన కార్యాలయానికి వచ్చారు. ఎస్‌పి అందుబాటులో లేకపోవడంతో త్రిబుల్‌సి ఛాంబర్‌ అధికారిని కలిసి సమస్యను విన్నవించారు. అనంతరం మీడియాతో దస్తగిరి మాట్లాడుతూ.. వైసిపి సర్కారు హయాంలో తనకు ప్రాణాపాయం ఎక్కువగా ఉండడంతో టూ ఫ్లస్‌ టూ గన్‌మెన్‌, ఎస్కార్టు భద్రతను కల్పించారని చెప్పారు. టిడిపి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఒన్‌ ఫ్లస్‌ ఒన్‌ గన్‌మెన్‌ తరహాలో భద్రతకు తగ్గించారని తెలిపారు. తనకు భద్రతను పెంచాలని కోరడంతో పాటు గతంలో కడప సెంట్రల్‌ జైలులో బెదిరింపులు ఎదురైన సంగతిని సైతం ఎస్‌పికి వివరించడానికి వచ్చానని తెలిపారు. తాజాగా అసెంబ్లీలో సైతం వివేకా హత్య కేసు చర్చకు వచ్చిన నేపథ్యంలో త్వరగా వాస్తవాలను నిగ్గుతేల్చే పనిలో ఉన్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని కోరారు.

➡️