ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఇ, ఇండిస్టీస్, సెర్ప్ శాఖల అధికారులతో సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని సూచించారు. హైబ్రీడ్ విధానంలో ఇంటి నుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహుళజాతి కంపెనీలతో శిక్షణ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. విజయవాడ వరదల్లో మునిగి సర్వం కోల్పోయిన బాధితులు ఉపాధి చూపించాలని తనను కోరారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ చేపట్టాలన్నారు. వివిధ కారణాలతో గ్రామాల్లో
ఉండిపోయిన వారికి పనిచేసేందుకు అవసరమైన అవకాశాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ఈ పనిచేయాలని చెప్పారు.
