విజయవాడ : ముంబయి సినీనటిని వేధించిన కేసుకు సంబంధించి అరెస్టయిన సీనియర్ ఐపిఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయలును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో విజయవాడ జిల్లా జైలు నుంచి ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం 10 గంటలకు పీఎస్ఆర్ ఆంజనేయులును కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉంది. అయితే పీఎస్ఆర్ కు బీపీ హెచ్చుతగ్గుల కారణంగా ఆయన్ను కస్టీడీలోకి తీసుకోవడంలో ఆలస్యమైంది. దాదాపు గంట ఆలస్యంగా కస్టడీలోకి తీసుకుని విజయవాడ జీజీహెచ్కు తరలించారు. మూడు రోజుల పాటు పీఎస్ఆర్ ను ప్రశ్నించాల్సి ఉంది. ఈ 3 రోజుల విచారణలో కీలక విషయాలు బయటపడుతాయని భావిస్తున్నారు. దీనివెనకున్న సూత్రధారులు, కీలక పాత్రధారుల, అంతిమ లబ్ధిదారులు ఎవరనే విషయం బయటపడుతుందని చెబుతున్నారు. ముంబై నటిని వేధించి ఆమె ఓ పారిశ్రామికవేత్తపై పెట్టిన కేసు ఉపసంహరించుకునేలా చేయడంలో మొత్తం కుట్రపన్నింది ఎవరనే విషయం విచారణలో బయటపడుతుందని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో సాయంత్రం 5 వరకు పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణ కొనసాగనుంది. ముంబయి నటి వేధింపుల కేసులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రయత్నించారని సీఐడీ తరఫు న్యాయవాదులు సాయి రోహిత్, రాజేంద్రప్రసాద్ కోర్టుకు వివరించారు. సినీనటి వేధింపుల వెనుక ప్రణాళిక అంతా పీఆర్ఎస్ దే అని విశాల్ గున్నీ వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. విశాల్ గున్నీతోపాటు నాటి విజయవాడ సీపీ కాంతిరాణాను సీఎంఓకు పీఎస్ఆర్ ఆంజనేయులు పిలిపించారని ముంబయి సినీనటిపై తప్పుడు కేసు పెట్టి 42 రోజులు జైలులో ఉంచారని చెప్పారు. దీనిపై గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసు స్టేషన్లో కేసు నమోదైందని కోర్టుకు వివరణ ఇచ్చారు.
