దెయ్యాలమెట్టపై క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌ లీజు రద్దు చేయాలి

  • రాష్ట్ర మైనింగ్‌ సెక్రటరీకి మాజీ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌.శర్మ లేఖ

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ జిల్లా ఆనందపురం మండలం కుసులవాడ పంచాయతీలోని ఇచ్చాపురం దెయ్యాల మెట్ట కొండపై క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌ లీజును ప్రభుత్వం రద్దు చేయాలని మాజీ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌.శర్మ రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌కు లేఖ రాశారు. ‘ప్రజాశక్తి’ మెయిన్‌ పేజీలో ఈ నెల 4న ‘మరో కొండకు టెండర్‌’ అన్న శీర్షికతో ప్రచురితమైన వార్తా కథనాన్ని శర్మ తన లేఖకు జతచేసి ప్రభుత్వానికి పంపారు. కుసులవాడ ప్రాంతంలో మైనింగ్‌ లీజులపై గతంలో తాను లేఖ రాశానని గుర్తు చేశారు. కొండలపై సహజ సిద్ధమైన ప్రకృతి సంపదలకు విఘాతం కలిగిస్తే పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కొండల వద్ద గిరిజనులు జీవిస్తున్నారని తెలిపారు. స్థానికులకు, ముఖ్యంగా గిరిజనులకు ఉపాధి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు.

విశాఖ కలెక్టర్‌కు సిపిఎం లేఖ

దెయ్యాలమెట్ట కొండపై తవ్వకాల అనుమతులను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు సోమవారం లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. గనుల వెలికితీత పేరుతో కొండలను ధ్వంసం చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. ఇప్పటికే వాతావరణంలో ప్రతికూల మార్పులు సంభవించి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే మండలంలోని చిన్నయ్యపాలెం సర్వే నెంబరు 104లో క్వార్ట్‌జైట్‌, రఫ్‌ స్టోన్‌, గ్రావెల్‌ తవ్వకాల కోసం ప్రభుత్వం అనుమతులిచ్చేందుకు ప్రయత్నిస్తే ప్రజాభిప్రాయ సేకరణలో పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు.

➡️