నెల్లూరు : అల్లూరుకు చెందిన వ్యక్తి ర్యాట్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. అతనికి వైరల్ ఫీవర్ ఎక్కువవ్వడంతో చెన్నైలో వైద్యం చేయించుకున్నారు. ఆదివారం మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దీనిపై అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరావు మాట్లాడుతూ … ర్యాట్ ఫీవర్ ప్రాణాంతకమని, తాగే నీటిలో ఎలుకలు, పందికొక్కులు మూత్ర విసర్జన చేయడం వలన ఆ వ్యాధి సోకుతుందని వెల్లడించారు. ఆ నీటినే మనిషి తాగినప్పుడు ఈ జ్వరం వస్తుందన్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదని స్పష్టం చేశారు. నీటిని శుభ్రంగా ఉంచుకొని ఎలుకలు, పందికొక్కులతో జాగ్రత్తగా ఉండాలని కోరారు. వెంటనే చికిత్స చేయించకపోతే ప్రమాదం ఉండదని, నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిని రోగి ప్రాణానికే ముప్పు వస్తుందన్నారు. ర్యాట్ ఫీవర్ వచ్చాక.. వారం రోజుల తర్వాత శరీరంపై దద్దుర్లు వస్తాయన్నారు. వైరస్ నిర్ధారణ కోసం కిట్లు అందుబాటులో ఉన్నాయని, మొదట్లోనే తెలుసుకుంటే సమస్య ఉండదన్నారు.
