హైకోర్టుకు తెలిపిన సుబ్రమణ్యంరెడ్డి
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోందని 60 ఏళ్ల రిటైర్డు పోలీసు అధికారి సుబ్రహ్మణ్యంరెడ్డి హైకోర్టుకు చెప్పారు. ఏ కేసు నమోదు చేశారో చెప్పకుండా తిరుపతి నుంచి బలవంతంగా విజయవాడ తీసుకొచ్చారన్నారు. దర్యాప్తు పేరుతో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, కేన్సర్తో బాధపడుతున్న తన భార్యకు కనీసం మందులు కొనే సమయం కూడా పోలీసులు ఇవ్వలేదని చెప్పారు. అనారోగ్యం కారణంగా రైలులో వస్తానని చెప్పినా తనతో పోలీసులను పంపి విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. ఈ వివరాల తర్వాత హైకోర్టు, సిట్ దర్యాప్తు అధికారే కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలంది. దర్యాప్తు అధికారి శ్రీహరిబాబును సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. సుబ్రహ్మణ్యంరెడ్డి ఏ కేసులోనూ నిందితుడు కానప్పుడు ఆయన విషయంలో ఎందుకు పోలీసులు దారుణంగా వ్యహరించారని ప్రశ్నించింది. సుబ్రహ్మణ్యంరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేయాలంటే దర్యాప్తు అధికారే తిరుపతికి వెళ్లి ఆయన ఇంట్లోనే రికార్డు చేయాలంది. వాంగ్మూలం నమోదు చేసేప్పుడు దర్యాప్తు అధికారి తప్ప ఇతరులు ఉండకూడదని చెప్పింది. తమ అనుమతి తీసుకోకుండా ఏ పోలీసు అధికారి కూడా సుబ్రహ్మణ్యంరెడ్డి ఇంటికి వెళ్లకూడదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ కె మన్మథరావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
60 ఏళ్ల రిటైర్డు పోలీస్ ఆఫీసర్ టి బాల సుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారని, ఆయన ఆచూకీ తెలియడం లేదని వైసిపి నేత మేకా వెంకటరామిరెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. గత ఆదేశాల మేరకు సుబ్రహ్మణ్యంరెడ్డి వ్యక్తితంగా కోర్టుకు వచ్చి పై వివరాలు చెప్పడంతో హైకోర్టు పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
