- కేంద్రానికి నివేదిక ఇస్తాం : విదేశీ నిపుణుల బృందం
ప్రజాశక్తి – పోలవరం : డయాఫ్రం వాల్ నిర్మాణంలో మిగతా పానెళ్ల నిర్మాణం, గ్యాప్ 1, 2 నిర్మాణాల కోసం డిజైన్ల అనుమతుల విషయంలో సత్వర చర్యలు తీసుకోనున్నట్లు కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు విదేశీ నిపుణుల బృందం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జల వనరుల శాఖాధికారులు, కాంట్రాక్టు కంపెనీలతో విదేశీ నిపుణుల బృందం సమీక్షా సమావేశం మూడో రోజు బుధవారమూ కొనసాగింది. ఈ నెల నాలుగో తేదీన పోలవరం ప్రాజక్టుకు చేరుకున్న విదేశీ నిపుణుల బృందం గత మూడు రోజుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమయ్యే అంశాలు పరిశీలించింది. డయాఫ్రం వాల్ నిర్మాణం, బట్రస్ డ్యాం నిర్మాణం విషయంలో అధికారులకు పలు సూచనలు చేసింది. ఈ సమావేశంలో విదేశీ నిపుణులు రిచర్డ్ డొనెల్లీ, సి హించ్ బెర్గర్, జియాన్ ప్రాన్స్క్ డి సిక్కో, డేవిడ్ బి పాల్, సిఇ నరసింహమూర్తి, పిపిఎ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు సరబ్జెత్ సింగ్ భక్షి, రాకేష్ తేజ, అశ్వనీకుమార్ వర్మ, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, కేంద్ర మట్టి రాతి నాణ్యతా పరిశీలనా కేంద్రం అధికారులు మనీష్ గుప్తా, లలిత్ కుమార్ సోలంకి, మేఘా కంపెనీ ప్రతినిధి అంగర సతీష్ తదితరులు పాల్గొన్నారు.