హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన నిర్వహిస్తున్న కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్-మల్కాజిగిరి ఎంపీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు.
