హైదరాబాద్ : భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లోని అక్రమ నిర్మాణాలు ఎవరూ కట్టినా కూల్చేస్తాం అని వ్యాఖ్యానించారు. ఈ కూల్చివేతలపై తమపై ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా వాటికి తలొగ్గేది లేదని.. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని అనఆనరు. రేవంత్రెడ్డి ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ లేక్ సిటీ. గండిపేట, ఉస్మాన్ సాగర్.. హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్లు కట్టుకున్నారు. డ్రైనేజీలను చెరువుల్లో కలుపుతున్నారు. ఆ ఫాం హౌస్ల నాలాలు గండిపేటలో కలిపారు. హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్లో ఏం జరిగిందో అందరూ చూశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. ఆక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తాం. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయడం లేదు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండొచ్చు. కానీ, నేను ఎవరినీ పట్టించుకోను. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. భవిష్యత్ తరాలకు ప్రకతిని అందించాలి’ అని ఆయన అన్నారు.
Revanth Reddy : ఒత్తిడికి తలొగ్గేదే లేదు..అక్రమ నిర్మాణాలు ఎవరు కట్టినా కూల్చేస్తాం
