వైఎస్‌ఆర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

May 8,2025 21:06 #3 death, #Kadapa, #road acidnet

ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్‌ఆర్‌ కడప జిల్లా) : కంటైనర్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి అదే వాహన కింద పడి ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేంపల్లె శ్రీరాంనగర్‌ గుట్టకు చెందిన బాలయ్య (50), అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన మట్లి మల్లికార్జున (30) బంధువులు. వీరి స్నేహితుడైన రాజీవ్‌ నగర్‌ కాలనీకి చెందిన సిద్ద మల్లికార్జున (46)తో కలిసి వ్యక్తిగత పని నిమిత్తం నందిమండలానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. కొత్తూరు గ్రామం వద్దకు రాగానే ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఓవర్‌ టేక్‌ చేస్తూ అదుపు తప్పి కంటైనర్‌ వెనుక టైర్ల కింద పడ్డారు. ఈ ప్రమాదంలో సిద్ధ మల్లికార్జున తలపై కంటైనర్‌ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బాలయ్య, మట్లి మల్లికార్జునకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో వేంపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ మృతిచెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

➡️