అక్రమంగా తరలిస్తున్న 347 తాబేళ్లు స్వాధీనం

ప్రజాశక్తి-మోతుగూడెం (అల్లూరి జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న 347 తాబేళ్లను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు అటవీ డివిజన్‌, లక్కవరం రేంజ్‌ పరిధిలోని తులసిపాక గ్రామ శివారు ప్రాంతం సోకిలేరు బ్రిడ్జి వద్ద బుధవారం అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్కవరం రేంజ్‌ అటవీ క్షేత్రాధికారి గవిరెడ్డి వెంకట నానాజీ కథనం ప్రకారం.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి ఒడిశా రాష్ట్రానికి ఆటోలో పన్నెండు బస్తాల్లో తరలిస్తున్న 347 తాబేళ్లను అటవీ అధికారులు స్వాధీనం చేసుకొని, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామంలో విక్రేత నెల్లూరి శ్రీనును అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న 347 తాబేళ్లలో 65 మృతి చెందాయి. వాటిని చెక్‌పోస్టు సమీప అటవీ ప్రాంతంలో దహనం చేశారు. మిగిలిన 282 తాబేళ్లను చింతూరు శబరి నదిలో విడిచిపెట్టినట్టు నానాజీ తెలిపారు.

➡️