ప్రయివేటీకరణతో తీవ్ర నష్టం

May 11,2025 00:18 #Visakha Steel Protest

జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌
ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని, రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, గాజువాక జోన్‌ ప్రధాన కార్యదర్శి గొలగాని అప్పారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారమూ కొనసాగాయి. దీక్షల్లో జివిఎంసి కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు, దేశ రక్షణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్లకు అప్పగించాలని కుట్రలు పన్నడం దారుణమన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రధాని మోడీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముద్దాడ ప్రసాద్‌, శేషు, ఎం.ఈశ్వరరావు, కిరణ్‌ పాల్గొన్నారు.

➡️