ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. ఒకపక్క ఆంధ్రుల హక్కుకు గౌరవం ఉందంటూనే.. మరోపక్క ప్లాంట్ అమ్మే కుట్రకు ప్రధాని మోడీ ఆజ్యం పోస్తూనే ఉన్నారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేటీకరణ లేదంటూనే.. ప్లాంట్ను అమ్మే నిర్ణయంలో మార్పు లేదంటూ లిఖిత పూర్వక సమాధానం ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వానిది పచ్చి మోసమని, ప్లాంట్ను ఉద్ధరించామని చెప్పినవన్నీ ఉత్తమాటలేనని అన్నారు. ప్లాంట్ను అదానీ కంపెనీకి అప్పనంగా కట్టబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియలో కర్త మోడీ, కర్మ, క్రియ బాబు, పవన్ అని చెప్పారు. డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన సమాధానంపై బాబు, పవన్ తమ వైఖరి ప్రకటించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో వీలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.
