డిజిటల్‌ మార్కెటింగ్‌పై దృష్టి : సిసోడియా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిజిటల్‌ మార్కెటింగ్‌ విధానంపై ఆప్కో, లేపాక్షి సంస్థలు దృష్టి సారించాలని చేనేత, జౌళిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా సూచించారు. అమ్మకాలను ఆధునీకరణ క్రమంలో మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, వాట్సాప్‌తో విక్రయాలు వంటివి చేపట్టాలన్నారు. విజయవాడలోని ఆప్కో కార్యాలయంలో ఆప్కో, లేపాక్షి సంస్థలపై సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ఉత్పత్తులు ఒకే షోరూమ్‌లో అందుబాటులో ఉండే విధంగా సమాఖ్య పద్ధతిలో వీటిని అభివృద్ధి చేయాలన్నారు. వినియోగంలో లేని స్థిరాస్తులను గుర్తించి వాణిజ్యపరంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. మొత్తం ఆర్థిక కార్యకలాపాలకు ఒకే బ్యాంక్‌ను భాగస్వామిగా ఎంపిక చేయాలని, ఆ బ్యాంక్‌తోనే సిఎస్‌ఆర్‌ నిధులు, తక్కువ వడ్డీ రేట్లు, ఉచిత సాఫ్ట్‌వేర్‌ వంటి సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్పత్తుల విభిన్నత, బ్రాండింగ్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలని, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఆధునిక మార్కెట్‌కు అనుగుణంగా మలచాలని సూచించారు. విదేశీ విపణిలో ప్రవేశానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఉత్పత్తులు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆప్కో జిఎంలు నాగేశ్వరరావు, రాజారావు, లేపాక్షి సీనియర్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️