విజయవాడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణను పొగమంచు కమ్మేసింది. గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి రెండు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. చాలా చోట్ల దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో ఉదయాన్నే నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా విజయవాడ – హైదరాబాద్ హైవేపై పలు ప్రాంతాల్లో వాహనాలు ఆగిపోయాయి. జగ్గయ్యపేట వద్ద భారీ పొగమంచు వల్ల వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. చెన్నై-కలకత్తా హైవేపై కూడా కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రాజధాని హైదరాబాద్తోపాటు కుమ్రంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఎపిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లితో పాటు పలు చోట్ల అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పొగమంచు దట్టంగా కమ్ముకుంది.
