ముగిసిన ‘మనపల్లె జానపదం జాతర’
ప్రజాశక్తి – ఎస్వియు క్యాంపస్ : జానపద గేయాలు, పాటలు సమాజంలో సామాజిక చైతన్యానికి ఎంతో దోహదపడతాయని వక్తలు ఉద్ఘాటించారు. ”మన పల్లె జానపదం జాతర”ను ఐఎస్ఒ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సంస్థ ప్రజా కళావేదిక, ఎస్వియు విద్యార్థుల సంక్షేమం, సాంస్కఅతిక వ్యవహారాల సంచాలకుల సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వియు సెనేట్ హాలులో నిర్వహించారు. రెండవరోజు శనివారం ముగింపు సభకు ప్రజా కళావేదిక చైర్మన్ అరవ జయపాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ డైరెక్టర్ మురళీధర్, అతిథులుగా ఎపి గ్రంథాలయ పరిషత్ పూర్వ సభ్యులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, ప్రముఖ కవి, ప్రిన్సిపల్ డాక్టర్ సి. నారాయణస్వామి, సినీ గీత రచయిత, ప్రసిద్ధ కవి సురేంద్ర రొడ్డ, కవయిత్రి, రుయా ఆసుపత్రి సర్జన్ డాక్టర్ రోజా రమణి, కల్చరల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్, జానపద కళాకారుడు వేలూరు జగన్నాథం హాజరై మాట్లాడారు. జానపద గేయాల్లో కథా గేయాలు, జానపద పురాణాలు, ఇతిహాసాలు, గద్య కథనాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలికాలు, నుడికారాలు, తిట్లు, ఒట్లు వంటివి ఉన్నాయన్నారు. పుట్టుక, వివాహం, మరణం తదితరాంశాలకు సంబంధించిన ఆచారాలు, కుటుంబం, సంబంధ బాంధవ్యాలు, పండుగలు, వినోదాలు, ఆటలు, జానపద వైద్యం, మతం, నమ్మకం వంటి సాంఘిక ఆచారాలు ప్రస్తావిస్తారన్నారు. సంగీతం, నృత్యం, అభినయం ఉండే ప్రదర్శన కళలన్నీ జానపద కళలుగా రాణిస్తున్నాయని తెలిపారు. అనంతరం కళాకారులు జానపద గేయాలు ఆలపించారు. అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా కళావేదిక ప్రతినిధులు గుండ్లూరు సుబ్రహ్మణ్యం, లింగుట్ల వెంకటేశ్వర్లు డాక్టర్ నటరాజ నాయుడు, జానపద కళాకారులు కెఎం రత్నం, రెడ్డి ప్రసాద్, తెలంగాణ నుంచి కట్ల శ్రీనివాసులు, ప్రజా నాట్యమండలి పాండురంగా రావు, లాలయ్య, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 300 మందికి పైగా కళాకారులు పాల్గన్నారు.
