మార్క్స్ జయంతి సభలో వక్తలు
సామ్రాజ్యవాదంపై పోరాటమే మార్క్స్కు నివాళి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆటుపోట్లు ఎన్ని ఎదురైనప్పటికీ సోషలిజానిదే భవిష్యత్ అని పలువురు వక్తలు అన్నారు. కారల్ మార్క్స్ జయంతి సందర్భంగా హనుమాన్పేటలో మార్క్స్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యాన సోమవారం నివాళులర్పించారు.ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణమాలు సోషలిజందే అంతిమ విజయమన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికవర్గం హక్కుల కోసం పోరాడుతోందని, మే 20న సమ్మెకు సన్నద్ధం అవుతోందని తెలిపారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాదం పేరుతో కార్మికులను, ప్రజలను చీలుస్తోందని విమర్శించారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో కులగణన ప్రకటించారని, గతంలో ఇదే మోడీ కులగణన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని, బలహీన పరుస్తుందని, అర్బన్ నక్సల్స్ను ప్రోత్సహిస్తుందని చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం కులగణన ప్రకటించారంటే రాజకీయంగా వారి వాదన ఎలా దివాళా తీసిందో అర్థమవుతుందని విమర్శించారు. ఆపరేషన్ కగార్ మైనింగ్ కార్పొరేట్లను ప్రోత్సహించేందుకు తప్ప మరొకటి కాదని అన్నారు. దీనిపై మోడీ,అమిత్షాలు చేస్తున్న వాదనల్లో పసలేదని చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షులుగా ట్రంప్ ఎన్నికైన తర్వాత సుంకాలు భారీగా పెంచడం ఆర్థిక సంక్షోభానికి దారి తీసిందన్నారు.
అమెరికా గుండెల్లో చైనా సింహస్వప్నంగా ఉందన్నారు. మార్క్స్ సిద్ధాంత స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం బిజెపికి అలవాటుగా మారిందని, చివరకు పహల్గాం ఉగ్రదాడి ఘటనను సైతం ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకునేందుకు దిగజారిందని అన్నారు. ఇలాంటి సమయంలో దేశ సమైక్యతను చాటేందుకు ప్రతిఒక్కరూ కదిలిరావాలని కోరారు. ఇజ్రాయిల్-పాలస్తీనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వెనక సామ్రాజ్యవాద దేశాల కుట్రలు ఉన్నాయన్నారు. సమాజంలో అందరికీ తిండి, ఇళ్లు, బట్ట వంటి కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, దానికి అనుగుణంగా కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. న్యూ డెమోక్రసీ నాయకులు పోలారి, హక్కుల ఉద్యమ నాయకులు భాస్కరరావు మాట్లాడుతూ.. దేశంలో బిజెపిని గద్దె దించాలంటే కమ్యూనిస్టులందరూ ఒకే వేదిక మీదకు రావాలని ఆకాంక్షించారు. తొలుత ప్రజా నాట్యమండలి నాయకులు నజీర్ ఆలపించిన విప్లవ గేయాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, విజయవాడ కార్పొరేషన్లో సిపిఎం ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ సత్తిబాబు, సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.