- ముఖ్యమంత్రికి వి. శ్రీనివాసరావు లేఖ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : క్రషింగ్ సీజన్లో అనకాపల్లి జిల్లా చోడవరం సహకార చక్కెర కర్మాగారంలో తరచూ చెరుకు క్రషింగ్ ఆగిపోతోందని, ఈ సంవత్సరమూ (2024-25) ఆగిపోయిందని, వెంటనే సమస్యలు పరిష్కరించి ఫ్యాక్టరీ నడిచేలా చూడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆయన మంగళవారం లేఖ రాశారు. రోజులు తరబడి ఫ్యాక్టరీ నడవకపోవడంతో చెరకు ఎండల్లో ఎండిపోతూ రికవరీ, టన్నేజ్ రాక రైతులు నష్టపోతున్నారని లేఖలో ఆయన వివరించారు. ఫ్యాక్టరీకి తెచ్చిన లారీలు, ట్రాక్టర్లు, ఎడ్లబళ్లు వారం రోజుల వరకు అన్లోడ్ కాకపోవడంతో వాహనాల అద్దెల భారం భరించలేక రోజుల తరబడి పశువులను ఫ్యాక్టరీ వద్ద ఉంచలేక రైతులు నలిగిపోతున్నారని పేర్కొన్నారు. సీజన్ ప్రారంభం నుండి ఫ్యాక్టరీలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, స్కిల్డ్ వర్కర్లు లేకపోవడం, కరెంటు అంతరాయాలు వంటి కారణాల వలన క్రషింగ్ సజావుగా జరగక చెరుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఫ్యాక్టరీ 1955వ సంవత్సరంలో రిజిస్టరయి 1962వ సంవత్సరంలో 1,000 టన్నులు క్రషింగ్ సామర్ధ్యంతో ప్రారంభించారని, 2003 నాటికి 4,000 టన్నులకు పెంచారని పేర్కొన్నారు. ప్రస్తుతం 23,477 మంది షేర్ హోల్డర్స్, 14,500 మంది చెరుకు సప్లై చేస్తున్న రైతులూ ఉన్నారని, దశాబ్దాల క్రితం నిర్మించిన కర్మాగారం యంత్రాలు పాతవై, పనిచేయక మొరాయిస్తున్నాయని వివరించారు. మరోవైపున మెయింటినెన్స్ ఓవరాల్ పనుల్లో నాణ్యత లేమి కారణాల వల్ల ఫ్యాక్టరీ సరిగా నడవక తరచూ అంతరాయం ఏర్పడుతూ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఫ్యాక్టరీ ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో నడుస్తున్న ఈ ఒక్క చక్కెర ఫ్యాక్టరీనీ కాపాడాలనే రైతాంగం కోరికను నెరవేర్చాలని కోరుచున్నాము. 2025 జనవరి 20న సీజన్ ప్రారంభించిన నాటి నుండి ఇంతవరకు సప్లై చేసిన రైతులకు పేమెంట్లు ఇవ్వలేదని వివరించారు. షుగర్ కంట్రోల్ యాక్ట్ 1966 ప్రకారం చెరుకు సరఫరా చేసిన 15 రోజులకు రైతులకు డబ్బులు చెల్లించాలని చట్టం చెబుతున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించలేదని, గత సంవత్సరం బకాయిలు, ఈ సంవత్సరం పేమెంట్స్ ఇంతవరకు చెల్లింపులు లేవని తెలిపారు. రైతులు అప్పులు చేసి మరీ ఫ్యాక్టరీకి చెరుకు సప్లై చేస్తున్నారని తెలిపారు. కార్మికులకు బకాయిలు జీతాలూ చెల్లించాలని, ప్రభుత్వం జోక్యం చేసుకొని బకాయిల చెల్లింపు కోసం తక్షణ సహాయంగా 35 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరపై ‘రాష్ట్ర సలహాధర’ మన రాష్ట్రంలో అమలు కాలేదని, దాని వల్ల టన్ను చెరుకుకి రైతు రూ.500 నష్టపోతున్నాడని, దేశంలో అన్ని రాష్ట్రాలూ సలహాధర ఆయా రాష్ట్రాల్లో చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సలహాధరలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గతంలో పనిచేసిన 29 షుగర్ ఫ్యాక్టరీలకు 24 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, ఈ సంవత్సరం ఐదు ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తున్నాయని, వీటికి సరిపడినంత చెరకు లేదని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో చక్కెరకు డిమాండ్ ఉన్నప్పటికీ ఫ్యాక్టరీలు మూతపడటం రాష్ట్రాభివృద్ధికి దోహదపడే చర్య కాదని, రైతులు చెరకు పంట ధర గిట్టుబాటుగాక సాగు తగ్గించారని వివరించారు. ప్రభుత్వం రాష్ట్రంలో చక్కెర పాలసీ రూపొందించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రతి 15 రోజులకు చెల్లింపులు జరపాలని కోరారు. మంచి రికవరీ టన్నేజ్ వచ్చే చెరుకు వంగడాలను రైతుకు అందించాలని, రాష్ట్రంలో చెరకు పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలని, తక్షణం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆధునికరించాలని శ్రీనివాసరావు ముఖ్యమంత్రిని కోరారు.