ఒఎంసి కేసులో కొన్ని ముఖ్యాంశాలు..

May 6,2025 22:41 #mining case, #Obulapuram

ప్రజాశక్తి- హైదరాబాద్‌ :  2007 జూన్‌ 18న ఒఎంసికి లీజులు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగానే ‘క్యాప్టివ్‌’ అనే పదాన్ని తొలగించారని, తద్వారా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2009లో డిసెంబర్‌ 7న సిబిఐ కేసు నమోదు చేసింది.

  •  ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో స్టే రావడం, మళ్లీ డివిజన్‌ బెంచ్‌ స్టే ఎత్తివేయడం..ఇలా పలు రకాల పిటిషన్లు వేయడంతో దాదాపు 15 ఏళ్లపాటు విచారణ కొనసాగింది. కేసు దర్యాప్తునకే ఐదేళ్లు పట్టింది. 2009 నుంచి 2014 వరకు సిబిఐ నాలుగు ఛార్జిషీట్లను దాఖలు చేసింది.
  •  ఒఎంసి వ్యవహారంలో 2011లో ఛార్జిషీట్‌ను తొలిసారి వేయగా.. 2014లో తుది ఛార్జిషీట్‌ తర్వాత సుదీర్ఘంగా విచారణ జరిగింది. 219 మంది సాక్షులను విచారించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు సాక్ష్యాలు, ఆధారాలను సిబిఐ సేకరించింది.
  •  అనంతపురంలోని ఓబుళాపురంలో గనుల కేటాయింపు, తవ్వకాలకు సంబంధించి అత్యాధునిక పరికరాలతో సిబిఐ ఆధారాలు సేకరించింది. అక్రమంగా తవ్వకాలు, రవాణా, ఎగుమతులు, విక్రయాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు సిబిఐ గుర్తించింది. ఎపి, కర్ణాటక సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టినట్టు అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి ఆధారాలు, సాక్ష్యాల సేకరణతో 2014లో తుది ఛార్జిషీట్‌ దాఖలైంది.
  •  విదేశాలకు అక్రమంగా దాదాపు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేశారని, అక్రమ బినామీ లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని సిబిఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది.
  •  ఈ కేసు విచారణలో మొత్తంగా 3,337 డాక్యుమెంట్లను పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన 68 హెక్టార్లలో కాకుండా పెద్ద ఎత్తున మైనింగ్‌ చేపట్టినట్లు సిబిఐ గుర్తించింది.
  •  ఈ కేసులో విచారణ దశలోనే నిందితుడు లింగారెడ్డి మృతి చెందారు. ఐఎఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని 2022లో ఈ కేసు నుంచి తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి చేసింది.

కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కా : సబితా ఇంద్రారెడ్డి

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో తనను సిబిఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను నిర్దోషిగా ప్రకటించిన న్యాయ వ్యవస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసు విషయంలో పన్నెండున్నరేళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఎన్ని అపవాదులు వచ్చినా తన నియోజకవర్గ ప్రజలు మాత్రం తనకు అండగా నిలిచారన్నారు. ఈ తీర్పు అనంతరం ఆమె కోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు.

➡️