తెలంగాణ : నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 78వ పుట్టిన రోజును పురస్కరించుకొని … పిసిసి ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు. 78 కిలోల కేక్ను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావుతో రేవంత్ కట్ చేయించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ … సోనియా గాంధీ పుట్టినరోజునే గతంలో తెలంగాణ ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం … సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. 6 గ్యారంటీ హామీల్లో రెండింటిని సోనియా పుట్టిన రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామని, వారి ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీకి వెళుతున్నామని అన్నారు.
ప్రధాని మోడి శుభాకాంక్షలు..
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రధాని నరేంద్రమోడి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నానన్నారు.