- వహల్గాం దాడికి ‘సిందూర్’ సరైన సమాధానం
- సమీక్షలో ముఖ్యమంత్రి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో జనాభా పెరుగుదలే లక్ష్యంగా ప్రత్యేక పాలసీని రూపొందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రణాళిక శాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే అనేక| కార్యక్రమాలను తీసుకువస్తున్నామని, తాజాగా మహిళా ఉద్యోగినులకు ప్రసూతి సెలవుల అంశంలోనూ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇద్దరుకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా నిర్ణయించామని, అలాగే జనాభా పెరుగుదలకు ఉన్న అవకాశాలు గుర్తించడంతోపాటు అడ్డంకులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. వీటి ఆధారంగానే పాలసీని కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పి-4 అమలుపై కూడా చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రధానంగా పి- 4 అమలులో భాగంగా బంగారు కుటుంబాలను గుర్తించడం, వారికి అందించాల్సిన సాయం వంటి అంశాల ప్రగతిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 15,315 బంగారు కుటుంబాలను 1,118 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని ఈ సందర్భంగా అధికారులు సింకు వివరించారు. ఈ విధానాన్ని వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన 25 మందితో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని, దీనికి అనుసంధానంగా కార్యనిర్వాహక కమిటీ, ఎంపవర్డ్ బృందాలను ఏర్పాటుచేసి, మొత్తంగా పి-4 ఫౌండేషన్ను ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు తనతోపాటు అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందివరకు అందరికీ కెపాసిటీ బిల్డింగ్పై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీనివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ కొత్తదనాన్ని పెంచు కుంటూ, సాంకేతికపై అవగాహన పెంచుకుంటే పాలనలో ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్పారు. అలాగే జిఎసిపి వృద్ధిపైనా అధికారులతో చర్చించారు. 2029, 2047 నాటికి నిర్దేశించుకున్న వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు గట్టిగా ప్రయత్నించాలని అధికారులకు సూచించారు.
‘ఆపరేషన్ సిందూర్’కు అభినందనలు
సమీక్షా సమావేశంలో తొలుత ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ జరిగింది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం జరిపిన దాడులను సిఎం ప్రశంసించారు. పహల్గాం దాడికి కేంద్రం గట్టి సమాధానం ఇచ్చిందని, ప్రభుత్వ విదేశాంగ విధానం కారణంగానే ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పియూష్కుమార్, ఇతర ఆర్థిక, ప్రణాళిక శాఖల అధికారులు పాల్గొన్నారు.
అన్ని స్థాయిల్లో సిద్ధంగా ఉండాలి : సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై సీఎం సమీక్ష
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో అధికారులు, సంస్థలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సివిల్ | డిఫెన్స్ కార్యాచరణపై సిఎం వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. కేంద్రం సైతం రాష్ట్రప్రభుత్వాల సన్నద్ధతపై పలు సూచనలు చేసిందని, వాటిని పూర్తిగా అమలు చేయాలని చెప్పారు. అన్ని శాఖలు అత్యంత సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు ఆందోళన చెందకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూడాలని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, టిటిడి వంటి చోట్ల ప్రత్యేక రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 24 గంటలు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం తరపున కేంద్ర సంస్థలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తామని, ఏ సమయంలో అయినా తమను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.