శ్రీలక్ష్మికి సుప్రీంలో ఎదురుదెబ్బ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఐఎఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ 2022లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సిబిఐ వాదనలు వినిపించింది. సిబిఐ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్స్‌లో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా శ్రీలక్ష్మి అరెస్ట్‌ అయి కొంత కాలం జైలులో కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో శ్రీలక్ష్మిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసి డిశ్చార్జ్‌ చేసింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును విచారణ చేపట్టాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

➡️