తిరుమల : తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణరథం బయలుదేరింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరీ కల్యాణ రథానికి పూజలు చేశారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరగనుంది. యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తామన్నారు. జనవరి 18, 26 తేదీల్లో, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో 4 సార్లు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. కుంభమేళాను దిగ్విజయం చేసేందుకు అందరు సహకరించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు.