- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్
ప్రజాశక్తి-కడప అర్బన్ : సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ)ల సాధికారతతోనే రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిపుష్టి సాధ్యమవుతుందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఎంఎస్ఎంఇ, సెర్ప్ కార్యకలాపాలపై అధికారులతో గురువారం కడప కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో ఒక భాగంగా ఉన్న ఎంఎస్ఎంఇ విభాగాన్ని ఒక ప్రత్యేక పారిశ్రామిక రంగంగా ఒక పాలసీని తీసుకొచ్చామని,అందుకు సంబంధించి ”ఉద్యం” పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టామన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ప్రతి ఒక్కరూ ఉద్యం పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని.. ప్రభుత్వం నుంచి రాయితీలను పొందేలా ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త తయారు కావలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని పేర్కొన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న ఇండిస్టీలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఇండిస్టీలో మ్యాన్ పవర్ అవసరం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. జమ్మలమడుగు, కమలాపురం ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, కృష్ణ చైతన్యరెడ్డి, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, ఇండిస్టియల్ జిఎం చంద్ బాషా, డిఆర్డిఎ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.