- యువతకు పిలుపునిచ్చిన జెసి అదితి సింగ్
- అగ్నివీర్ అర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
ప్రజాశక్తి – కడప : ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరైన అభ్యర్థులు ఆత్మవిశ్వాసం, విజయకాంక్షతో లక్ష్య సాధన దిశగా అడుగులేయాలని వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ (జెసి) అదితి సింగ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆదివారం వేకువజామున ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ, ఎంపికలు రిక్రూటింగ్ డైరెక్టర్ కల్నన్ పునీత్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి జెసి ముఖ్య అతిథిగా హాజరై మొదటి దశ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీకి హాజరైన అభ్యర్ధులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ ఆర్మీలో చేరేందుకు నిర్వహించే ఎంపికకు ఇప్పటికే రాత పరీక్ష పూర్తయ్యి అందులో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కడపలో ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా నిర్వహించే ఫిజికల్ టెస్ట్లో అభ్యర్థులు విజయం సాధించి దేశానికి భద్రతనిచ్చే గొప్ప యువశక్తిగా, భారత సైన్యంలో ఒక్కరుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్డిఒ ఇర్విన్, కెఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రాకేష్ చంద్, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.