ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేది నుండి 22వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) సమ్మె నోటీసు అందచేసింది. తాడేపల్లిలోని డిఎంఎ కార్యాలయంలో డిఎంఎ పి.సంపత్ కుమార్ను ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు సహా పలువురు రాష్ట్ర నాయకులు సోమవారం కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఈ నెల 20 వతేదిన , స్థానిక సమస్యల పరిష్కారం 21,22 తేదీలలో సమ్మె నిర్వహించనున్నట్లు ఈ నోటీసులో పేర్కొన్నారు. లేబర్ కోడ్స్ రద్దుతోపాటు రాష్ట్రంలో ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేటు ఎజెన్సీలకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని, మున్సిపల్ పారిశుధ్యం, ఇంజనీరింగ్, కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. సమ్మె నోటీసు అందజేసిన వారిలో ఫెడరేషన్ కార్యదర్శి బి.ముత్యాలరావు, రాష్ట్ర నాయకులు టి.తిరుపతమ్మ, జె.విజయలక్ష్మీ, ఎస్.దాసు తదితరులు ఉన్నారు.
