సిఐడికి హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి : మద్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ రాజ్ కసిరెడ్డి దాఖలు చేసిన కేసులో వివరాలు సమర్పించాలని సిఐడి అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ టి మల్లికార్జునరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. కసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే ఆన్లైన్లో వాదిస్తూ, మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశామని, దీనిని అత్యవసరంగా జరపాలని కోరారు. వైసిపి ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి సంబంధించి గతేడాది సెప్టెంబర్ 23న సిఐడి కేసు నమోదు చేసింది.
వాళ్లను ఇంటి వద్దనే విచారించండి
మద్యం కేసులో గత వైసిపి ప్రభుత్వంలో ఐటి సలహాదారుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి వేరే పిటిషన్ వేశారు. తనను ఇంటి వద్ద విచారించేలా సిట్ అధికారులను ఆదేశించాలని రాజ్ కసిరెడ్డి తల్లిదండ్రులు కసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, సుభాషిణి లంచ్మోషన్ పిటిషన్ వేశారు. నోటీసులను అందుకున్నాక సిట్ ఎదుట హాజరయ్యారని వాళ్ల న్యాయవాది చెప్పారు. పిటిషనర్లకు 60 ఏళ్లకు పైబడి వయసని, ఇంటి వద్ద న్యాయవాదుల సమక్షంలో విచారణకు అనుమతించాలని కోరారు. దీనిపై పిపి ప్రతివాదన చేస్తూ, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 మేరకు పిటిషనర్లను వారి ఇంటి వద్ద విచారించేందుకు అభ్యంతరం లేదన్నారు. వాదనల తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ పిటిషనర్లను న్యాయవాదుల సమక్షంలో వారి ఇంటి వద్దే విచారించాలని సిట్ను ఆదేశించారు. వాళ్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. విచారణను మే 5కు వాయిదా వేశారు.