- సమీక్షలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దీపం పథకంలో భాగంగా మార్చి 31వ తేదీలోపు బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సిలిండర్ ఇచ్చిన వెంటనే సబ్సిడీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. విజయవాడలోని సివిల్ సప్లై భవన్లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూసబ్సిడీ జమ చేసే విషయంలో సాంకేతిక సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబరు 1967 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, ఎండి మంజీర్ జిలానీ, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రైతులకు బ్యాంకర్లు సహకరించాలి
ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలకు సక్రమంగా చెల్లింపులు జరిపేందుకు సహకారం అందించాలని బ్యాంకర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. విజయవాడలోని సివిల్ సప్లై భవన్లో బ్యాకర్లతో సమావేశం అయిన ఆయన గడిచిన 9 నెలల్లో రూ.24 వేల కోట్లను, ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించినట్లు చెప్పారు. వాట్సాప్ను వినియోగించుకుని 17 వేల మంది రైతులు ధాన్యం విక్రయించినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ఆరు లక్షల మంది రైతుల నుంచి 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని చెప్పారు. నూతన సాంకేతిక విధానంలో కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి ప్రతి వేర్ హౌస్ గోదాము వద్ద ఎఐ సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్, ఎండి మంజీర్ జిలానీ వివిధ బ్యాంక్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.