ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజ్ఞా వికాసం పరీక్ష విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం మోడల్ టెస్ట్ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ప్రశ్నపత్రాలను వన్టౌన్ సిఐ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహన్, జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న పబ్లిక్ పరీక్ష కోసం విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. రామ్మోహన్ మాట్లాడుతూ మొదటిసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది ఒక మోడల్ ఎగ్జామ్గా ఉంటుందని, విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొడుతుందని తెలిపారు. సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజ్ఞా వికాస పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి రూ.5 వేలు, 3 వేలు, 2 వేలు చొప్పున నగదు బహుమతులు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాము, సహాయ కార్యదర్శి రవి, జిల్లా నాయకులు రాజు, సూరిబాబు, సమీరా, జయ, ఎర్రమ్మ పాల్గొన్నారు.
బొబ్బిలి : పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజ్ఞా వికాసం ప్రశ్నాపత్రాలను పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయగౌరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రసన్నకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి.చినబాబు, జిల్లా సహాయ కార్యదర్శి కె.మణికుమార్, బొబ్బిలి మండల కార్యదర్శి కేశవ, మండల సహయ కార్యదర్శి జానీ, మండల నాయకులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: స్థానిక చైతన్య డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞ వికాసం పరీక్ష పేపర్ను యుటిఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి. వెంకటరావు ఆవిష్కరించారు. ఈ ప్రజ్ఞ వికాస పరీక్షలలో అన్ని పాఠశాలలకు చెందిన 290 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఏ.అను, మండల గర్ల్స్ కో కన్వీనర్ రత్న, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె రమేష్, మండల కమిటీ సభ్యులు వి.చరణ్, రవి, శీల, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
రాజాం: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పేరుతో మోడల్ టెస్ట్ నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ప్రశ్నాపత్రాలను జిల్లా ఉపాధ్యక్షులు పి.రమేష్, జిల్లా కమిటీ కోగర్ల్ కన్వీనర్ బి.రూప చేతుల మీదుగా ఆవిష్కరించారు.
