- బంధువులు దుష్ప్రచారం తట్టుకోలేక చనిపోతున్నామంటూ వీడియో
నిజామాబాద్ : రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టపూర్ రైల్వే గేటు సమీపం చోటుచేసుకుంది. పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్ (28), పొతంగల్కు చెందిన శైలజ (24)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్, శైలజకు ఏడాది కిందట వివాహమైంది. వారిద్దరూ ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి సోమవారం బయటకు వచ్చారు. అనంతరం తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని దాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ వీడియో కోటగిరి ఎస్సై సందీప్కు పంపారు. ఆయన నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్కు వీడియోతోపాటు వారి సెల్ఫోన్ నంబరు పంపారు. ఆయన సిబ్బందితో బాసర వంతెన దగ్గరకు వెళ్లి గాలించగా కనిపించలేదు. బాధితుల ఫోన్ నంబరును ట్రాక్ చేయగా ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు నవీపేట ఎస్సై గుర్తించి అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై కనిపించాయి. రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్సై చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.