ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండు చేస్తూ నేడు, రేపు జరుగుతున్న ఏజెన్సీ బంద్కు సిపిఎం మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1/70 చట్టాన్ని సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై గిరిజనుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు తన వైఖరిని స్పష్టం చేయకపోవడం వల్ల వారిలో ఆందోళన ఇంకా పెరుగుతోందని తెలిపారు. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండు చేశారు. బంద్ను భగం చేయడానికి పోలీసులు నోటీసు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రశాంతంగా సాగే బంద్ను శాంతిభద్రతల సమస్యగా మార్చవద్దని, వెంటనే నోటీసులు
ఉపసంహరించుకుని, బంద్ శాంతియుతంగా జరిపేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రాంతం రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు కిందకు వస్తుందని, దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికీ లేదని తెలిపారు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వీటిని వెంటనే అరికట్టాలని కోరారు. ఇప్పుడు 1/70 చట్టం సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుందని, ఏజెన్సీలో లభించే సహజ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎప్పటి నుండో పలు పథకాలు వేస్తోందని తెలిపారు. 1/70 చట్టాన్ని సవరించే ప్రయత్నాన్ని ప్రజాతంత్రవాదులు, మేధా వులు అడ్డుకుని గిరిజనులకు అండగా నిలవాలని, బంద్కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
