నాయుడుపేట (తిరుపతి) : అమెరికాలో తెలుగు వైద్యుడు పేరంశెట్టి రమేశ్బాబు (64) గత శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన రమేశ్ బాబు తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు చెబుతున్నప్పటికీ ఘటన ఎలా జరిగిందో తెలియరాలేదు.
రమేశ్బాబు తండ్రి రైతు చినగురునాథం. ముగ్గురు తోబుట్టువుల్లో పెద్దవాడైన రమేశ్బాబు పదో తరగతి వరకూ మేనకూరులో చదువుకున్నారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. జమైకాలో ఎమ్మెస్ పూర్తిచేశాక, అమెరికా చేరుకుని వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా, అందరూ అక్కడే స్థిరపడ్డారు. రమేశ్బాబు కరోనా సమయంలో విశేష సేవలందించి పురస్కారాలు అందుకున్నారు. తాను చదువుకున్న ఉన్నత పాఠశాలకు గతంలో రూ.14 లక్షల విరాళమిచ్చారు. స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి రూ.20 లక్షలు అందించారు. ఈ నెల 15న నాయుడుపేటలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గన్న ఆయన.. అంతలోనే మఅతి చెందారన్న వార్త కుటుంబసభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన తల్లి, తమ్ముడు తిరుపతిలో, సోదరి నాయుడుపేటలో నివాసముంటున్నారు. వీరంతా అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. డాక్టర్ రమేశ్బాబు అమెరికాలో పలుచోట్ల ఆసుపత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించారు. టస్కలూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రమేశ్బాబు సేవలకు గుర్తింపుగా అక్కడి వీధికి ఆయన పేరు పెట్టారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చేవారు.
