పొగాకు వ్యాపారుల సిండికేట్‌

May 10,2025 00:37 #pogaku

 రోజూ 25 శాతం బేళ్లు కొనకుండా తిరస్కరణ
చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వం
సమాఖ్యను రంగంలోకి దించేందుకు సిద్దం కాని రాష్ట్ర ప్రభుత్వం
సీలింగ్‌ ధర రూ.280 కొనసాగింపు
ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : పొగాకు వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. సీలిదగ్‌ ధరకు మించి కొనుగులు చేయడం లేదు. పైగా, కుంటి సాకులతో రోజూ 25 :శాతం బేళ్లను కొనకుండా తిరస్కరిస్తున్నారు. అయినా, కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది పొగాకు సమాఖ్యను రంగంలోకి దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. దీంతో, ధర గిట్టుబాటు కాక రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది పెట్టుబడులు పెరిగినందున కిలోకు కనీసం రూ.300 ధర వస్తేనే బయటపడతామని వారు అంటున్నారు. రాష్ట్రంలో పొగాకు కొనుగోలు మార్చిలో ప్రారంభమైంది. వేలం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. పేరుకే వేలం తప్ప వ్యాపారులు పోటీపడి కొనడం లేదు. వేలంలో తక్కువ మంది మాత్రమే పాల్గొంటున్నారు. ఆరంభం నుంచీ సీలింగ్‌ ధర కిలోకు రూ.280 మాత్రమే అమలు చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా పెంచడం లేదు. మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఇటీవల ఒంగోలు కేంద్రాన్ని సందర్శించిన రోజు కూడా వేలంలో వ్యాపారులు ఎక్కువ మంది లేరు. ధర ఒక్క రూపాయ కూడా పెంచలేదు. వ్యాపారుల తీరుపై మంత్రి అసంవృప్తి వ్యక్తం చేసి దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. సిపిఎం నేతలు, రైతు సంఘం నేతలూ వేలం కేంద్రాలను సందర్శించి పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. వైసిపి నేతలు కూడా వేలం కేంద్రాలను సందర్శించారు. వ్యాపారుల సిండికేట్‌ దోపిడీ మాత్రం సాగుతోంది. కిలో పొగాకుకు రూ.280 గరిష్ట ధర ఇస్తున్నారు. కనిష్ట ధర రూ.200 ఉంది. సగటు ధరలు నల్లరేగడి నేలల్లో పండించిన పొగాకుకు రూ.257, తేలిక నేలల్లో పండించిన పొగాకుకు రూ.260 మాత్రమే దక్కుతోంది. గరిష్ట ధర ఇచ్చే బేళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంంది. రోజూ కేంద్రాలకు వచ్చే బేళ్లలో 25 శాతం పొగాకును కొనకుండా తిరస్కరిస్తున్నారు. వారం రోజులపాటు గ్రేడింగు చేసి కేంద్రానికి పొగాకు తీసుకొచ్చినా వివిధ కుంటుసాకులతో వ్యాపారులు కొనకుండా తిరస్కరిస్తున్నారు. దీంతో, ఇంటికి తీసుకుపోయి మళ్లీ నెల రోజుల తర్వాత తీసుకురావాల్సి వస్తోంది. దీనివల్ల రైతులు వ్యయప్రయాశలకు గురి కావాల్సి వస్తోంది. నాణ్యత కూడా తగ్గిపోతోంది.

తిరస్కరణ ఇలా…
ఈ నెల 2 నుంచి 7వ తేదీ మార్కెట్‌కు వచ్చిన పొగాకు, తిరస్కరణకు గురైన బేళ్లను పరిశీలిస్తే… నల్లరేగడి నేలల్లో పండించిన 19,969 బేళ్లను రైతులు తీసుకు రాగా, 4,368 బేళ్లను వ్యాపారులు తిరస్కరించారు. 15,701 బేళ్లను మాత్రమే కొన్నారు. తేలిక నేలల్లో పండించిన 21,226 బేళ్లను తీసుకురాగా, 4,829 బేళ్లను తిరస్కరించారు. 16,397 బేళ్లను మాత్రమే కొన్నారు. రోజుకు ఎనిమిది వేల బేళ్లను కేంద్రాలకు తెస్తున్నారు. వాటిల్లో 25 శాతం బేళ్లను వ్యాపారులు తిరస్కరించి వెనక్కి పంపుతున్నారు.

పోటీ లేకపోవడమే దోపిడీకి కారణం
వేలంలో వ్యాపారులు కొద్దిమందే పాల్గొంటున్నారు. అయినా, పొగాకు బోర్డు ప్రేక్షకపాత్ర వస్తోంది. ఈ ఏడాది 140 మిలియన్‌ కిలోల సాగుకు అనుమతిచ్చింది. వాతావరణం సానుకూలంగా లేకపోవడం,.అకాల వర్షాల వల్ల దిగుబడి, కొంత నాణ్యత తగ్గింది. బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు కూడా పంట వచ్చే పరిస్థితి లేదు. విదేశీ ఎగుమతులు లేవనే సాకుతో వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారు. పోటీ లేకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని వ్యాపారుల సిండికేట్‌కు అడ్డకట్ట వేయాలని, పొగాకుకు గిట్టుబాట ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

➡️