ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, జౌళి, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ తన సహకారాన్ని అందించాలని ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చైన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్తో నారా లోకేష్ గురువారం చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పుట్ వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ తీసుకువచ్చిన పాలసీలు, తీసుకున్న చర్యల గురించి మంత్రి లోకేష్కు తైవాన్ ప్రతినిధుల బృందం వివరించింది. రాష్ట్రంలో ఈ రంగాల అభివృద్ధికి తీసుకొచ్చిన పాలసీలను లోకేష్ వివరించారు.
మనోజ్ఞను అభినందించిన లోకేష్
జెఇఇ మెయిన్లో నూటిని నూరు శాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను మంత్రి లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉత్తమ ఫలితంతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచావని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. ఏ అవసరం ఉన్నా అన్నగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మెకానికల్, ఇంజనీరింగ్, ప్రతి బిడ్డ విషయంలో అమ్మ పాత్ర ముఖ్యమైందని ఆమె తల్లిని సత్కరించారు.
