- ఆలపాటి, వర్మ పేర్లు పరిశీలన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : త్వరలో జరగనున్న శాసనమండలి పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై టిడిపి కసరత్తు చేస్తోంది. కృష్ణా-గుంటూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, తూర్పు-పశ్చిమ గోదావరి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పదవీ కాలాలు మార్చితో ముగుస్తున్నాయి. దీంతో ఈ స్థానాల్లో తన అభ్యర్థులను టిడిపి పోటీలో ఉంచేందుకు సిద్ధమైంది. కృష్ణా-గుంటూరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తూర్పు-పశ్చిమ గోదావరి నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా వీరిద్దరికీ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించలేదు. దీంతో వీరిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు.