హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 15 నుండి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని తెలంగాణ విద్యాశాఖ గురువారం ప్రకటించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మార్చి 15 నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొంది. పిల్లలకు 12.30గంటలకు మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించింది. పబ్లిక్ పరీక్షలు ఉన్నందున పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటించారు. ఎస్ఎస్సి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు.
