వైసిపి నాయకులకు జగన్ ఆదేశం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించాలని, వారికి ధైర్యం చెప్పాలని వైసిపి నాయకులను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలన్నారు. అకాల వర్షాలకు పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతోపాటు అనేక ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వర్షాలు వస్తాయని ముందుగా సమాచారం ఉన్న కల్లాల్లోని పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ఆగ్రహించారు. ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రబీ సీజన్లోనైనా తేరుకుందామనుకున్న వారికి తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలుచోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు అకాల వర్షాల వల్ల మరింతగా నష్టపోతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఉద్యాన పంటలూ దెబ్బతిన్నాయని, ఆయా ప్రాంతాల్లో నాయకులు పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని, వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
