ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు (1001), జైళ్లు (81)లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల అమలుపై నివేదిక ఇవ్వాలని డిజిపి, జైళ్లశాఖ డిజిలను హైకోర్టు ఆదేశించింది. ఎన్ని పనిచేస్తున్నాయో, ఎన్ని పనిచేయడం లేదో, ఇంకా ఎన్ని ఏర్పాటు చేయాలో పూర్తి వివరాలు ఇవ్వాలంది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేస్తూ, జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఆదేశించింది. పిఎస్లు, జైళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2019లో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ఉన్న 1001 పోలీస్ స్టేషన్లలో 10 వేలు, 81 జైళ్లలో 1,752 చొప్పున సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎసిపి) టి విష్ణుతేజ చెప్పారు.