6,49,884 మంది హాజరు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజు మార్చి రోజు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు.వీరిలో బాలురు 3,36,225 మంది, బాలికలు 3,13,659 మంది ఉన్నారు. ఈ నెల 31వ తేది వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. ఈ నెల 31వ తేదిన ఒకవేళ రంజాన్ అయితే ఏప్రిల్ 1వ తేదిన సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 163 సమస్యాత్మక కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. విద్యార్ధులు హాల్ టిక్కెట్లు చూపించి ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు ఏమైనా ఉంటే 0866-2974540 నెంబర్కు గానీ, [email protected] మెయిల్ ద్వారా గానీ చెప్పవచ్చు. ఏప్రిల్ 3 నుంచి 9వ తేది వరకు పేపర్ మూల్యాంకనం 26 జిల్లా కేంద్రాల్లో జరగనుంది.
‘పది’ విద్యార్ధులకు ఉచిత ప్రయాణం : మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పదవ తరగతి విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్ధులకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని, విద్యార్ధులు వారి హాల్ టిక్కెట్ను చూపించి ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేదిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకండి
పదవ తరగతి పరీక్షలకు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని బిసి వసతి గృహ విద్యార్ధులతో పాటు ఇతర విద్యార్ధులకు బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. ఈ పదవ తరగతి పరీక్షలలో కూడా ఎంజెపి స్కూళ్లు, బిసి వసతి గృహాల విద్యార్ధులు సత్తా చాటాలని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్ధి జీవితంలో పదవ తరగతి పరీక్షలు ఒక మైలు రాయని, ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని మంత్రి సూచించారు.
విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం చంద్రబాబు
పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్ధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ప్రయాణంలో ఈ పరీక్షలు మైలురాయి అని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ కూడా విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ప్రశాంతంగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి ఒత్తిడికి గురికావొద్దని సూచించారు.