- కేంద్ర గ్రంథాలయ పరిరక్షణకు ఐక్య ఉద్యమం
- రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు
- 18 మందితో పరిరక్షణ కమిటీ ఏర్పాటు
ప్రజాశక్తి – శ్రీకాకుళం : జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన సముదాయాన్ని అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలు మానుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ పరిరక్షణపై శ్రీకాకుళం నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో రౌండ్టేబుల్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. యుటిఎఫ్ నాయకులు గొంటి గిరిధర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ఉన్న భవనాలను పడగొట్టి కొత్తగా నాలుగు ఫ్లోర్లు నిర్మిస్తామని, అందులో ఒక ఫ్లోర్ గ్రంథాలయానికి కేటాయించి మిగిలిన వాటిని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగిస్తామన్న ప్రతిపాదనలను ఖండించారు. ఈ ప్రతిపాదన అభివృద్ధి నిరోధకమని తెలిపారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే గ్రంథాలయ ఉద్యమం మొదలైందని, నాటి నుంచి గ్రంథాలయాల అభివృద్ధికి అనేక మంది కృషి చేశారని అన్నారు. అటువంటి గ్రంథాలయాల ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం గ్రంథాలయాల వినాశనానికి పూనుకుంటోందని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తున్నాయన్నారు. గ్రంథాలయానికి వందలాది మంది పాఠకులు నిత్యం వస్తుంటారని, మేధో సంపత్తికి నిలయాలుగా ఉన్న గ్రంథాలయాలపై ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. ప్రస్తుత పరిణామాలు విజ్ఞాన సముపార్జన ప్రక్రియకు తీవ్ర ఆటంకమని తెలిపారు. గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, భవిష్యత్ ఉద్యమానికి అన్ని వర్గాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ లైబ్రేరియన్ కెబి సుబ్రమణ్యం కన్వీనర్గా జిల్లా కేంద్ర గ్రంథాలయ పరిరక్షణ కమిటీని 18 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. సమావేశంలో శ్రీకాకుళ సాహితీ సభ్యులు అట్టాడ అప్పలనాయుడు, సాహితీ స్రవంతి అధ్యక్షులు కె శ్రీనివాసు, బిఎల్ నారాయణ, విశాఖ జిల్లా పౌర గ్రంథాలయ సేవా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె త్రిమూర్తులురెడ్డి, పి మల్లేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, విశ్రాంత డిప్యూటీ డిఇఒ కొత్తకోట అప్పారావు, యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం నాయకులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.