- తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే 21 నుంచి నిరవధిక నిరహార దీక్ష
- పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్ప్లాంట్ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని విధాలా దెబ్బతీస్తోందని పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1545వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం కాకుండా ప్రయివేటీకరణ దిశగా వెళ్లేందుకు కేంద్రం రూ.11 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందన్నారు. ఒక చేత్తో నిధులిచ్చి మరో చేత్తో దోచుకుంటోందని విమర్శించారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ప్లాంట్ సంపూర్ణ లాభాల బాటలో నడిచిందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్మాగారానికి కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. ప్లాంట్ నష్టాల దిశగా వెళ్లడానికి కారణమేంటని ప్రశ్నించారు. మోడీ గడిచిన పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. టిడిపి కూటమి ప్రజాప్రతినిధులు మాత్రం ఆయనను భుజాలపై మోస్తున్నారని విమర్శించారు. ప్లాంట్కు సమీపంలోని గంగవరం పోర్టులో ఉన్న సుమారు రూ.9500 కోట్ల విలువైన ప్రభుత్వానికి చెందిన 10 శాతం వాటాలను కేవలం రూ.650 కోట్లకు అదానీకి గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మేశారన్నారు. అదానీ అంటేనే బిజెపి అని తెలిపారు. ఉక్కు కార్మికుల పక్షాల కాంగ్రెస్ నిలబడుతోందన్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన ప్లాంట్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటీకరించేందుకు పూనుకోవడం దారుణమన్నారు. వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం.. నిర్వాసితుల హక్కులను కాలరాయడమే అవుతుందన్నారు. ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ ప్లాంట్ నుంచి తొలగించిన కార్మికులకు ఈ నెల 20వ తేదీలోపు విధుల్లోకి తీసుకోకపోతే 21 నుంచి తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. దీక్షా శిబిరంలో కాంగ్రెస్ నాయకులు జెర్రిపోతుల ముత్యాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్, డి.ఆదినారాయణ పాల్గొన్నారు.