హైదరాబాద్: ఆహ్లాదంగా గడుపుదామని ఫాంహౌస్కు వచ్చిన పలువురు స్విమ్మింగ్ పూల్లో దిగి.. ఆ నీటిలో కరెంటు షాక్ కు గురై తీవ్రగాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ శివారు జల్పల్లి శివారులో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది ఆహ్లాదంగా గడిపేందుకు జల్పల్లిలోని ఫాంహౌస్కు గురువారం ఉదయం వెళ్లారు.
సాయంత్రం సమయంలో ఫాంహౌస్లోని స్విమ్మింగ్ పూల్లోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా గాయపడ్డారు. కొలను చివరిభాగంలో ఉన్న ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు, ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. కొలను మధ్యలోనే ఉన్న పర్వేజ్(19), ఇంతియాజ్(22) రెండు నిమిషాల పాటు విద్యుదాఘాతానికి గురయ్యారు. తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఈతకొలను లోపల లైటింగ్ కోసం ఏర్పాటుచేసిన వైరింగ్ తెగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఈత కొలనులోని దీపాల వైర్ల కనెక్షన్లను లోపలి నుంచి కాకుండా బయటినుంచి ఇచ్చారు.
