పలు సమస్యలపై చంద్రబాబుకు సిపిఐ వినతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కౌలు రైతుల సంక్షేమం కోసం సమగ్రమైన నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని సిపిఐ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. సచివాలయంలో సిఎంను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్‌ గురువారం కలిసి పలు సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా తడిసి రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని, వర్షానికి దెబ్బతిన్న ఉద్యాన పంటలకు అందించే నష్టపరిహారాన్ని పెంచాలని కోరారు. ప్రభుత్వం త్వరలోనే అందించనున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులకు వర్తింపజేయాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఆర్‌డిటికి విదేశీ నిధులకు సంబంధించిన అనుమతులను పునరుద్ధరించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

➡️