- కేంద్ర మంత్రి సురేష్ గోపి వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి, కేరళలోని త్రిస్సూర్ ఎంపి సురేష్ గోపి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి ఇవ్వాలని అన్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి చేరిన సురేష్ గోపి ఆదివారం ఢిల్లీలో జరిగిన బిజెపి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో మాట్లాడుతూ గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాలు వారు పర్యవేక్షిస్తేనే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. ‘గిరిజన సమాజానికి చెందిన వ్యక్తి మాత్రమే ఆ వ్యవహారాల శాఖ మంత్రి అవుతున్నారు. ఇది మన దేశానికి శాపం. గిరిజన సమాజం వెలుపల నుంచి ఒకరిని వారి సంక్షేమం కోసం నియమించాలనేది నా కల. నా భావన. ఒక బ్రాహ్మణుడు లేదా మరొక ఉన్నత కులస్థుడు ఆ శాఖ బాధ్యతలు చేపట్టనివ్వండి. గణనీయమైన మార్పు ఉంటుంది’ అని అన్నారు. అదే విధంగా గిరిజన నాయకులకు ఉన్నత వర్గాల సంక్షేమ శాఖ ఇవ్వాలని సురేష్ గోపి సూచించారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి మార్పు జరుగాలని అన్నారు. అలాగే గిరిజన వ్యవహారాల శాఖను నిర్వహించాలనే తన కోరికను కూడా ఆయన వ్యక్తం చేశారు. ఆ మంత్రిత్వ శాఖను తనకు కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరినట్లుగా వెల్లడించారు. కాగా, సురేష్ గోపి చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.