- ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు
- సబితా ఇంద్రారెడ్డి, కృపానందం నిర్దోషులుగా ప్రకటన
ప్రజాశక్తి- హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. 15 ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్థన్రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్థన్రెడ్డి సహా నలుగురికి ఏడేళ్లపాటు జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఒఎంసి)కి రూ.2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఆమెతోపాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంనూ సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసులో విడి రాజగోపాల్కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. భూగర్భగనుల శాఖ డైరెక్టర్గా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనపు శిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందున మొత్తంగా 11 ఏళ్ల పాటు ఆయనకు జైలు శిక్ష పడింది.