రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్లతో ఈ నెల 20న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక, కర్షక సంఘాలు పిలుపునిచ్చాయి. విజయవాడ ప్రెస్క్లబ్లో రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్ల రాష్ట్ర స్థాయి సంయుక్త సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతు నాయకులు రాకేష్ టికాయత్పై జరిగిన దాడిని ఖండించారు. సి2ప్లస్ 50 ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని కోరారు. రైతు రుణాలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్కోడ్లు అమలుతో కార్మికవర్గ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని, వెట్టిచాకిరీ, బానిస విధానానికి కార్మిక లోకం బలైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికవర్గం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశ వ్యాప్త సమ్మె కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకులు కెవివి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండో అమెరికన్ ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్లు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం 200 రోజులకు, రోజువారీ కూలీ రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలన్నారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ.. సెకీ, యాక్సిస్ విద్యుత్తు ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. నూతన మార్కెట్ పాలసీని రద్దు చేయకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల వృత్తిదారుల హక్కులు కాపాడాలన్నారు. రైతు నాయకులు చుండూరు రంగారావు మాట్లాడుతూ.. ధాన్యం, పొగాకు, శనగ, మినుముల పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కేటాయించి, కొనుగోలు చేయాలన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి పోలారి మాట్లాడుతూ.. కార్మికులు తమ పోరాటాల ద్వారా సాధించిన హక్కులు, చట్టాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. కార్మికవర్గం తమ శక్తిని ఈ సమ్మె ద్వారా చాటాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దడాల సుబ్బారావు, రైతు సంఘాల నాయకులు ఎం సూర్యనారాయణ, డి హరినాథ్, ఎం వెంకటరెడ్డి, యు వీరరాజు, పోతురాజు, మేకల ప్రసాద్, పగడాల ఆంజనేయులు, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్బాబు, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
