ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔసోర్సింగ్ ఎంప్లాయీస్ జెఎసి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేషనల్ హెల్త్ మిషన్లో గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న సిహెచ్ఒ (ఎంఎల్హెచ్పి) సమ్మెకు ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ జెఎసి సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు జెఎసి ఛైర్మన్ ఎ.వి నాగేశ్వరరావు, కో ఛైర్మన్ బి.కాంతరావు, కోశాధికారి డి.దయామణిలు గురువారం ప్రకటన విడుదల చేశారు. వెంటనే సంబంధిత సంఘాల ప్రతినిధులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు పంపిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎంలోని క్యాడర్లకు ఎంటిఎస్ అమలు చేయకుండా వివక్ష చూపుతుందన్నారు. 2022 వరకూ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులతో సమానంగా ఎన్హెచ్ఎంలోని అన్ని క్యాడర్లకు ఎంటిఎస్ అమలు చేసేదన్నారు. 15 ఏళ్లుగా అమలైన ఈ విధానానికి గత ప్రభుత్వం తూట్లు పొడిచిందని తెలిపారు. దీని వల్ల ఎన్హెచ్ఎంలోని అన్ని క్యాడర్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నియమాల ప్రకారం హ్యూమన్ రిసోర్స్ (హెచ్ఆర్) పాలసీ అమలు చేయాల్సి ఉండగా, దానిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎల్హెచ్పిలు వేతన పెంపు, హెచ్ఆర్ పాలసీ, ఇన్సెంటీవ్ బకాయిల చెల్లింపు తదితర డిమాండ్ల పరిష్కారం కొరకు సమ్మె నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎంఎల్హెచ్పిలు ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో వారి విధులు నిర్వహించకుండా వివిధ అదనపు పని భారాలను మోపుతున్నారని చెప్పారు. సెంటర్లలో కాకుండా ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వారికి మధ్యాహ్నం వరకూ వివిధ రకాలు పనులను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్లనే సమ్మె అనివార్యమైందన్నారు.